బెంగాల్లో ఎర్రకోటను బద్దలు కొట్టిన మమతా: అధికారం చేపట్టనున్న దీదీ

మూడు దశాబ్దాలకు పైగా పాలించిన కామ్రెడ్లకు బెంగాళీలు 294 సీట్లలో మూడొంతుల సీట్లు కూడా ఇవ్వలేదు. పార్టీ పెట్టిన 13 ఏళ్లకు ఎర్రకోటను దీదీ బద్దలు కొట్టారు. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కు చేసిన సేవలు, భూవివాదం విషయాల్లో ఆమె పోరాడిన వైనం ఫలితాల్లో కనిపిస్తున్నాయి. ప్రముఖంగా సింగూరులో టాటా కంపెనీకి కట్టబెట్టిన వెయ్యి ఎకరాల భూమిపై ఆమె నిరంతర పోరాటం చేసి బెంగాలీల ప్రేమ చూరగొన్నారు. కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ కూడా భారీ ఆధిక్యంతో గెలుపొందారు. కాగా టిఎంసీని గద్దెనెక్కించిన ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ పునర్నిర్మానానికి కృషి చేస్తానని చెప్పారు.
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు సిపిఎం ప్రకటించింది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పింది. ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య రాజీనామా చేశారు. దీదీ ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సుస్థిరతకు ప్రజలు పట్టం కట్టారని కాంగ్రెసు సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ అన్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య తృణమూల్ కాంగ్రెసు అభ్యర్థి మనీష్ గుప్తా చేతిలో ఓటమి పాలయ్యారు.












Click it and Unblock the Notifications