తెలుసుకోవడమే తప్ప ఏమీ తేల్చని ఆజాద్, కేవలం జాదూ పర్యటనే!

దాదాపు 17 గంటల పాటు వారితో మాట్లాడానని విలేకరులతో ఆజాదే స్వయంగా చెప్పుకున్నారు! రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చేయి దాటిపోతోందన్న విషయం మాత్రం ఈ పర్యటనతో ఆయనకు బాగా తెలిసొచ్చింది. ప్రభుత్వాన్ని సీఎం సరిగా నడపలేక పోతున్నారన్న విషయంతో పాటు ప్రత్యేక, సమైక్య వాదనలపై నేతలను ఒక్కతాటిపైకి తేవడం అసాధ్యమన్న వాస్తవాన్ని కూడా ఆయన గుర్తించారని చెబుతున్నారు. నిజానికి పర్యటన మొత్తంలోనూ డీఎస్ తన వెన్నంటే ఉన్నా, సీఎం తనను కలిసేందుకు గంటల తరబడి వేచి చూసినా వారిద్దరినీ ఆజాద్ దూరంగానే దూరంగానే ఉంచడం విశేషం! మంగళవారం గాంధీభవన్లో ఆజాద్ పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణలో ఉండటంతో డీఎస్ చాలాసేపు వేరే గదిలో కూర్చోవాల్సి వచ్చింది.
రాత్రి ఏడింటికి వచ్చిన కిరణ్ కూడా 40 నిమిషాల పాటు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. సరిగ్గా 7.50కి బయటికొచ్చిన ఆజాద్, ఫ్లైట్ టైమయిందంటూ వారితో 10 నిమిషాలే మాట్లాడి వెళ్లిపోయారు. ప్రభుత్వ పనితీరుపై శ్రేణుల నుంచి వచ్చిన విమర్శలను సీఎం ముందు పెట్టి, ఎందుకిలా జరుగుతోందని ప్రశ్నించారని తెలిసింది. సహచర మంత్రులే ఫిర్యాదులు చేయడమేంటని కూడా నిలదీసినట్టు సమాచారం. విమానాశ్రయం దాకా సాగనంపేందుకు కిరణ్, డీఎస్ సిద్ధమైనా, వారించి మరీ ఆజాద్ వెళ్లిపోవడం విశేషం! పర్యటన మొత్తంలోనూ సీఎంపైనే ఆజాద్కు అత్యధిక ఫిర్యాదులొచ్చాయి.
నేతలెవరినీ పట్టించుకోవడం లేదని, పాలనపై పట్టు లేదని, సీఎంగా పనికి రాడని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మెజారిటీ నేతలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం కొరవడిందన్నారు. డీఎస్ పనితీరుపై మాత్రం ఒక్కరూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు! డీఎస్కు పూర్తి స్వేచ్ఛనిస్తే పార్టీని బలోపేతం చేయగలరని పీసీసీ నేతలు ఆజాద్కు చెప్పారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలు, నష్టాలపై మంత్రి జానారెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఆజాద్కు నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరు, కడపలో ఘోర ఓటమికి కారణాల వంటివాటిపై పార్టీ శ్రేణులందరినీ ఆజాద్ ప్రశ్నించారు. మొత్తం పరిస్థితిపై త్వరలో అధిష్టానానికి ఆజాద్ నివేదిక సమర్పించనున్నారు.












Click it and Unblock the Notifications