కళ్యాణమస్తులో ఘోరాలు: నిత్య పెళ్లికొడుకులు, బాల్యవివాహాలు
చిత్తూరు జిల్లాలో ఓ జంట రెండోసారి కళ్యాణమస్తులో వివాహం చేసుకుంది. ఇది వరకు ఇదే వేదికపై ఈ జంట పెళ్లి చేసుకుంది. కళ్యాణమస్తులో ఇచ్చే వస్తువులకు ఆశపడి ఆ జంట మళ్లీ చేసుకున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో నూనె రామకృష్ణ అనే వ్యక్తి కళ్యాణమస్తులో రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. అతనికి ఇప్పటికే వివాహమై నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతను రాగిణి అనే మరో మహిళతో వైవాహికేతర సంబంధం పెట్టుకున్నాడు. శుక్రవారం కళ్యాణమస్తులో రాగిణిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. మొదటి భార్య బంధువులు రామకృష్ణపై దాడి చేశారు. ఆర్డీవో వివాహాన్ని రద్దు చేసి విచారణకు ఆదేశించారు.
ఆదిలాబాదు జిల్లా చెన్నూరులో ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రెండో వివాహం చేసుకోవడానికి కళ్యాణమస్తులో సిద్దమయ్యాడు. దాంతో పెళ్లికొడుకుపై మొదటి భార్య గొడవకు దిగింది. కరీంనగర్ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి రెండో పెళ్లికి సిద్ధపడింది. సంగీతారాణి అనే యువతి రాజు అనే యువకుడిని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. వరుడి బంధువులు గొడవ చేయడంతో పెళ్లి రద్దయింది.