పిసిసి అధ్యక్షుడిగా బొత్సకు చిరంజీవి మద్దతు, కిరణ్ కుమార్ వ్యతిరేకం
వెంటనే పిసిసి అధ్యక్ష పదవికి శ్రీధర్ బాబు పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదించారని అంటున్నారు. శ్రీధర్ బాబు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడగలరని, అన్ని వర్గాలను సమిష్టిగా ముందుకు నడిపించగలరని, పైగా శ్రీధర్ బాబు తెలంగాణకు చెందినవాడని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా చేస్తే రాష్ట్రంలో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన మంత్రులను కూడగట్టారు. పైగా, బొత్స పిసిసి అధ్యక్ష పదవికి తగినవారు కాదని చెప్పడానికి ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావును ముఖ్యమంత్రి ఆజాద్ వద్దకు పంపినట్లు తెలుస్తోంది.
ఇంతలో బొత్స సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మినారాయణ పేరు పిసిసి అధ్యక్ష పదవికి ముందుకు వచ్చింది. అయితే, ఆయనను పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు వ్యతిరేకిస్తున్నారు. శ్రీధర్ బాబు కాకపోతే కన్నా లక్ష్మినారాయణ అయితే బాగుంటుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. అయితే, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మాత్రం బొత్స సత్యనారాయణకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని కాంగ్రెసు పార్టీలోకి తేవడంలో బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు. చిరంజీవితో తనకు ఉన్న సంబంధాలను అందుకు వాడుకున్నారు.