రాజీనామా చేయనున్న నాగం జనార్దన్ రెడ్డి, తెలంగాణ వేదికతో ప్రజల్లోకి
పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అన్ని విధాలుగా సహకరించినందుకు బహుమతిగా తనను పార్టీనుంచి సస్పెండ్ చేశారని నాగం జనార్దన్రెడ్డి వ్యాఖ్యానించారు. 2008 ఉగాది రోజున తెలంగాణకు అనుకూలంగా పార్టీ తీర్మానం చేసిందని, దానికి కట్టుబడి ఉండాలని తాను అనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఆ తీర్మానానికి కట్టుబడి ఉంటే చిదంబరానికి లేఖ రాసేందుకు అభ్యంతరం ఏమిటన్నారు. చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను నాశనం చేస్తోందన్నారు. తెలంగాణలో టిడిపిని జీవం లేని పార్టీగా చేసేశారన్నారు. తెదేపా సమైక్యాంధ్ర విధానంతో ఉన్నట్లుగా సంకేతాలు వెళ్లాయని, అలాంటి సమైక్యాంధ్రవాదులతో కలిసి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎన్ని రోజులుంటారో ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.
పార్టీ పొలిట్బ్యూరో తనను సస్పెండ్ చేయడంపై నాగం బుధవారం అర్థరాత్రి తన నివాసంలో పలువురు నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు హరీశ్వర్రెడ్డి, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్రావు, తెలుగుదేశం ప్రచార కార్యదర్శి జైపాల్రెడ్డి, మహబూబ్నగర్ నుంచి వచ్చిన కార్యకర్తలు హాజరయ్యారు. ఆ తర్వాత నాగం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
''తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అసెంబ్లీలో తెలంగాణకు మద్దతిస్తామని ప్రకటించారు. అఖిలపక్ష సమావేశంలో మాతో చెప్పించారు. దీన్ని నమ్మి 2009 డిసెంబరు తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తామని ప్రకటించింది. వెంటనే 10వ తేదీన సీమాంధ్ర తెదేపా నేతలు కాంగ్రెస్ వారితో కలిసి కృత్రిమ ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి తెదేపా నాయకత్వం వాహనాలు ఇచ్చింది. ఫోన్లు చేసి, ఫోన్ సందేశాలు ఇచ్చి అన్ని రకాలుగా సహకరించింది. దీంతో వచ్చే తెలంగాణ వెనక్కుపోయింది'' అని విమర్శించారు. పార్టీ తీర్మానానికి వ్యతిరేకంగా సీమాంధ్రులు ఉద్యమిస్తే చర్యల్లేవు కానీ, తీర్మానానికి కట్టుబడి ఉండాలని అన్నందుకు తనపై చర్య తీసుకుంటారా అని ఆయన అన్నారు.