జగన్, దమ్ము లేకుంటే నోరు మూసుకో, అందుకే తిరుగుబాటు: బాబు
అదే వేదికపై బావమరిది హరికృష్ణకు కూడా సమాధానం చెప్పారు. బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు అని స్పష్టం చేశారు. బంధువులు మాకు అవసరం. అయితే టిడిపి కూడా ఓ పెద్ద కుటుంబం అని చెప్పుకొచ్చారు. కొందరు కార్యకర్తలు అనవసరంగా పోస్టర్లు వేసి వివాదం సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు. కన్నెర్ర చేసి ప్రభుత్వాన్ని పడగొడతానని ప్రగల్బాలు పలిగిన జగన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎందుకు పడగొట్టడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తన ఎమ్మెల్యేలతో గవర్నర్ను కలిస్తే రైతు సమస్యలపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తాము సిద్ధమని జగన్కు సవాల్ విసిరారు. నిత్యం ప్రభుత్వాన్ని పడగొడతానని హెచ్చరించే జగన్ ఇప్పటికైనా రైతు సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వంపై కన్నెర్ర చేయాలని సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని సూచించారు.
కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ఎంపీలు దద్దమ్మలని అన్నారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకు రాలేక పోతున్నారని ఆరోపించారు. వెనుక బడిన వర్గాల వారికి రిజర్వేషన్ కోసం జాతీయస్థాయిలో పోరాడటానికి తాము సిద్ధమని అన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెసు వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడాలన్న భావనతోనే ఎన్డీయేకు మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలన్నింటికీ కాంగ్రెసే కారణం అన్నారు. టిడిపికి సంక్షోభాలు కొత్త కాదని అన్నింటినీ అధిగమించిందని అన్నారు. కేంద్రానికి తెలంగాణపై నిర్ణయం తీసుకోవటం చేతకాకుంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిడిపిని విమర్శించే హక్కు ఏ పార్టీకి లేదన్నారు. కాంగ్రెసుతో తామూ లాలూచీ పడే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెసుది దృతరాష్ట్ర కౌగిలన్నారు. కొందరు ఎమ్మెల్యేలు పెళ్లి ఒకరితో చేసుకొని కాపురం మరొకరితో చేస్తున్నారని జగన్ వర్గం ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు.