రాజ్యసభకు నామినేట్ అయిన వేళ.. ఆజన్మాంతం రుణపడి ఉంటా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. కూటమి నుంచి మొత్తం నలుగురు ఎంపికయ్యారు. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేట్ అయ్యారు. సానా సతీష్ పెద్దల సభకు ఎంపికకావడం వరుసగా ఇది రెండోసారి. జనసేన నుంచి ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ నామినేషన్ సైతం దాఖలు చేశారు.
తనకు పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన నేపథ్యంలో.. చింతకాయల విజయ్ స్పందించారు. ఓ వీడియో విడుదల చేశారు. చంద్రబాబు, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలో ఓ సాధారణ కార్యకర్తకు కూడా అత్యున్నత అవకాశాలు, పదవులు లభిస్తాయనడానికి ఇది ఓ నిదర్శనమని వ్యాఖ్యానించారు. పార్టీలో కష్టపడే వారిని అగ్రనాయకత్వం ఎప్పటికీ విస్మరించబోదని పేర్కొన్నారు.

కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని చంద్రబాబు, నారా లోకేష్ రుజువు చేశారని చింతకాయల విజయ్ అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్ లకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. లోకేష్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానని, ఇచ్చిన ఈ అవకాశాన్ని ఓ గురుతర బాధ్యతగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉన్న నాయకులు, అనుచరులు, అభిమానులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్న అయిదేళ్లూ ప్రతి కార్యకర్త కూడా ఎంతో కష్టపడ్డారని, బాధలు, అవమానాలకు గురయ్యారని, మరికొందరు ప్రాణత్యాగాలు సైతం చేశారని చింతకాయల విజయ్ అన్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు పదవులు దక్కుతున్నాయనడానికి తన ఎంపికే ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు.
1983 నుంచి తన తండ్రి అయ్యన్నపాత్రుడు, కుటుంబ సభ్యులు టీడీపీకి వెన్నంటి ఉంటూ, పార్టీ అభ్యున్నతి కోసం పని చేశామని, అది గుర్తు పెట్టుకుని తనను నామినేట్ చేశారని వివరించారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తానని చెప్పారు. గ్రామ గ్రామాన టీడీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటోన్నానని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications