టిఆర్ఎస్ను తరిమి కొడదాం: మహానాడులో ఎర్రబెల్లి దయాకరరావు
పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీని, పార్టీ అధినేతను ఒక్క మాటైనా అనకుండా పార్టీని వీడి వెళ్లారని అలా వెళ్లకుండా నాగం విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టిడిపి పేదల పార్టీ అని ఈ పార్టీని ఇరు ప్రాంతాల్లో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేశాడని ఆ సమయంలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందన్నారు. వైయస్ తెలంగాణ భూములను అల్లుడికి ధారాదత్తం చేస్తున్నప్పుడు కెసిఆర్కు తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పార్టీ జెండాతోనే తెలంగాణ కోసం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ పాలన సాగిస్తున్న టిఆర్ఎస్ను తరిమి కొడదామని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.
అంతకుముందు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన వైయస్, కాంగ్రెసులకు తెలంగాణపై స్పష్టత లేదన్నారు. తెలంగాణపై టిడిపి ఇప్పటికే పలు వేదిలకలపై స్పష్టత ఇచ్చిందని చెప్పారు. పార్టీలో యువతకు పెద్ద పీట వేయాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. విపక్షాలు అన్ని రాష్ట్రంలో టిడిపి లేకుండా నాశనం చేయాలని చూస్తున్నాయని, అయితే టిడిపి లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు.