కిరణ్ కుమార్ రెడ్డిపై గవర్నర్ నరసింహన్ గుర్రు, డిఎస్ ఆగ్రహం
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానాన్ని మెప్పించి వ్యవహరించిన తీరు ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు కె. రోశయ్య, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాత్రమే కాకుండా మరింత మంది సీనియర్లు కూడా కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన రెడ్డప్పరెడ్డికి ఎమ్మెల్సీ సీటును కట్టబెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నిబద్దతతో పనిచేస్తున్న ఫరీదుద్దీన్ పేరును ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని కూడా తప్పు పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్కు, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి చెక్ పెట్టడానికే రాజేశ్వర్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. పోటీ చేసి ఓడిపోయిన రెడ్డప్పరెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసినప్పుడు తాము ఎందుకు అర్హులం కాదని డిఎస్, షబ్బీర్ అలీ అంటున్నారని సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై డిఎస్ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పల్లంరాజు కూడా కినుక వహించినట్లు చెబుతున్నారు. పార్టీకి సంబంధం లేని డ్వాక్రా మహిళను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి కూడా ముఖ్యమంత్రికి దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద, కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలి ప్రశ్నార్థకంగా మారింది.