తెలంగాణను మోసం చేసి విమర్శిస్తారా: సుష్మాపై ఎంపీ పొన్నం ఫైర్
సుష్మాస్వరాజ్ తమ పార్టీపై, సోనియాపై అవాస్తవ ఆరోపణలు చేశారన్నారు. బిజెపి కాంగ్రెసు పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నందున సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు కూడా ఆలోచించాలని సూచించారు. కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా సీమాంధ్రులు మద్దతు పలకాలన్నారు. వారు బిజెపి కుయుక్తులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఇరు ప్రాంతాల్లో కాంగ్రెసును రక్షించుకునేందుకు తెలంగాణ అత్యంత ఆవశ్యం అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకుంటుందని అన్నారు.
మరో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాము పదవులలో ఉన్నది తెలంగాణ సాధించడానికే అన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందంటే ఎప్పుడో చేసే వాళ్లం అన్నారు. అవసరమైతే రాజీనామాకే కాదు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెసు నాయకుల్లో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ఈ నెలాఖరు వరకు అధిష్టానానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత తెలంగాణపై ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణ కోసం ప్రత్యేక జెండాను తయారు చేసినట్టు మరో ఎంపి వివేక్ చెప్పారు.