చంద్రబాబు అవిశ్వాస తీర్మానం కూడా మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమా?
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుల మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే అవిశ్వాస తీర్మానం తెర మీదికి వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ అన్నారు. తమకు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని, కాంగ్రెసు శాసనసభ్యులు ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నామని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
కాగా, 294 సీట్లున్న శాసనసభలో కాంగ్రెసు పార్టీకి 155 మంది శాసనసభ్యులున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రజారాజ్యం పార్టీకి 18 మంది సభ్యులున్నారు. వీరిలో శోభానాగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. అంటే, 17 మంది ప్రభుత్వానికి మద్దతిస్తారు. మజ్లీస్ శాసనసభ్యులు ఏడుగురు కూడా ప్రభుత్వానికి మద్దతిస్తారు. తెలుగుదేశం పార్టీకి 90 మంది, తెరాసకు 11 మంది, వామపక్షాలకు ఐదుగురు, బిజెపికి ఇద్దరు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఒకరు, లోకసత్తాకు ఒకరు శాసనసభ్యులున్నారు. ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులున్నారు. ఒక శాసనసభ్యుడు రాజీనామా చేశారు. ప్రస్తుతం శానససభలో సభ్యుల సంఖ్య 293. ఈ లెక్కలను చూస్తే ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా ఉండదని అర్థమవుతోంది. అందుకే చంద్రబాబు ఈ దశలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని అంటున్నారు.