వైయస్ జగన్కు కోర్టు కేసులు తప్పవా, కాంగ్రెసు సిద్ధపడుతుందా?
వైయస్ జగన్ అనతి కాలంలో పెద్ద యెత్తున ఆస్తులు, ఆదాయం సమకూర్చుకోవడంపై వారు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలకు వైయస్ జగన్ తానుగా ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాత్రం జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ సంపాదన ఏదీ లేదని వారు చెబుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న కాలంలోనే వైయస్ జగన్ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ, జగన్పై కాంగ్రెసు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది ప్రశ్న.
జగన్పై కాంగ్రెసు ప్రభుత్వం అటువంటి చర్యలకు ఒడిగట్టే అవకాశాలను వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తోసిపుచ్చడం లేదు. కాంగ్రెసు ఆ విధమైన చర్యలకు దిగే అవకాశాలున్నాయని ఆయన ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో అన్నారు. అయితే, అలాంటి చర్యలకు దిగితే ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అంటున్నారు. శానససభ్యులను కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న తొలినాళ్లలో జగన్పై అలాంటి చర్యలు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ ఇప్పుడు చర్యలు తీసుకుంటే మాత్రం కాంగ్రెసు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. వైయస్ జగన్పై చర్యలకు ఒడిగట్టినా ప్రభుత్వం చేసేదేమీ లేదని ఆయన అన్నారు. జగన్కు వ్యతిరేకంగా ఒకటి, రెండు సాక్ష్యాలు లభించినా ఫలితం ఉండదని ఆయన అన్నారు.