చంద్రబాబుతో కారత్ భేటీ, వైయస్ జగన్తో దోస్తీ ప్లాన్కు బ్రేక్
తాను చంద్రబాబును కలవడానికే వచ్చానని కారత్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని పరిస్థితిని తాను చంద్రబాబుకు వివరించినట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి తమకు సహకరించాలని తాను చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. తాము జాతీయ రాజకీయాలపై చర్చించుకున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబుతో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని ఆయన చెప్పారు. సిపిఎం జాతీయ సమావేశాల్లో పాల్గొనడానికి కారత్ హైదరాబాద్ వచ్చారు. సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, తెలంగాణపై ఎవరిని ప్రశ్నించాలో వారిని ప్రశ్నించాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి మీడియా ప్రతినిధులకు సూచించారు. తెలంగాణపై ఎవరు నిర్ణయం తీసుకోవాలో, ఎందుకు తీసుకోవడం లేదో వారినే అడగాలని ఆయన అన్నారు. కమ్యూనిస్టులంతా కలిసి పని చేయాలనే తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సీతారాం ఏచూరి సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.