స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్, కాంగ్రెసు ప్రభుత్వానికి ఊరట
రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని, ఇది అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 60.50 శాతానికి చేరుకున్నాయి. బిసి రిజర్వేషన్లను 36 శాతానికి పెంచడంతో రిజర్వేషన్ల శాతం యాభై శాతాన్ని దాటింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా సంక్రమించాయి కాబట్టి వాటిని తగ్గించడం కుదరదు. బిసి రిజర్వేషన్లను మాత్రమే తగ్గించాల్సి ఉంటుంది. అయితే, రిజర్వేషన్లు తగ్గిస్తే సహించబోమని బిసి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
స్థానిక సంస్థలకు బ్రేకు పడడంతో కాంగ్రెసు పార్టీకి ఊరట లభించింది. ప్రభుత్వం స్థానిక సంస్థలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి స్థానిక సంస్థల్లో భారీ విజయాలను నమోదు చేసుకుంటాయనే అంచనాలున్నాయి. దీంతో కాంగ్రెసు గానీ తెలుగుదేశం గానీ స్థానిక సంస్థలను ఎదుర్కునేందుకు ఇష్టపడడం లేదు. అయితే, తాము ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నామని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడానికి హైకోర్టుకు వెళ్లిన సర్పంచ్ల సంఘం తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర బాబు కనుసన్నల్లో సాగుతోంది.