చిరంజీవి గెలిచారు, విజయవాడలో భారీ విలీన సభకు పచ్చజెండా

మంగళవారం సాయంత్రం చిరంజీవి కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సమావేశమైన సందర్భంగా సభ పెట్టాల్సిందేనని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం రాత్రి చిరంజీవి నివాసానికి వెళ్లి చర్చించారు. సభ ప్రతిపాదనను బొత్స బలపరిచారు. విజయవాడలో జక్కంపూడి ప్రాంతంలోనే 100 ఎకరాల స్థలం ఉందనీ, ఇందులోనే సభ ఏర్పాటు చేయవచ్చని భావించారు. స్థల పరిశీలన, ఇతర ఏర్పాట్ల కోసం అయిదుగురితో ఒక కమిటీని నియమించాలని నిర్ణయించారు. సాంకేతికంగా విలీన ప్రక్రియ పూర్తయినా,ప్రరాపా శ్రేణులన్నీ కాంగ్రెస్లో కలిసి పోయేందుకు కొంత సమయం పడుతుందని, ఇది సజావుగా సాగేందుకు ఒక కమిటీని నియమిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ప్రరాపాలో పని చేసిన సీనియర్ నాయకులు అయిదుగురి పేర్లను సూచిస్తే వారితోనే కమిటీ వేద్దామని బొత్స ప్రతిపాదించగా, దీనికి అంగీకరించిన చిరంజీవి రెండు రోజుల్లో పేర్లు ఇస్తానని చెప్పారు. విలీన సభ కోసం వేసే కమిటీనే సమన్వయానికీ కొనసాగిస్తే సరిపోతుందని భావించారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయాల పాలక మండళ్ల వంటి నామినేటెడ్ పదవుల్లో పార్టీ నాయకుల్ని నియమించేందుకు పేర్లు ఇవ్వాలని బొత్స సూచించారు. పీసీసీ, డీసీసీల్ని పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరిస్తున్నందు వల్ల వీటిల్లోనూ ప్రరాపా నాయకుల్ని సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రరాపా బలంగా ఉన్న ఒకటి, రెండు జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు సూచించగా.. స్థానిక పరిస్థితుల్నిబట్టి నిర్ణయం తీసుకోవాలని భావించారు. పీసీసీ, డీసీసీల్లో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్ష పోస్టుల్లో సీనియర్ నేతల్ని సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ అవసరాలకు అనుగుణంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా ఇతరత్రా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. బొత్సతో సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రయ్య, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, ఈలి నాని, శ్రీధర్ కృష్ణారెడ్డి, మహేశ్వర్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, అనిల్, రవి, రమేష్, సీనియర్ నాయకులు కోటగిరి విద్యాధరరావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications