తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామాలు రెడీ, స్పీకర్ ఫార్మాట్లోనే
ఇప్పటి వరకు 22 మంది తెలంగాణ శాసనసభ్యులు, ఆరుగురు రాష్ట్ర మంత్రులు, 12 మంది ఎమ్మెల్సీలు, ఆరుగురు పార్లమెంటు సభ్యులు తమ తమ రాజీనామా లేఖలు ఇచ్చారు. జులై 1వ తేదీ తర్వాత తమ రాజీనామా లేఖల కార్యాచరణను ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు అల్పాహార విందుకు హాజయ్యారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి వారికి విందు ఇచ్చారు.
ఈ నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి డెడ్లైన్ పెట్టారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి నిరాహార దీక్షకు దిగాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు.