ఇక అధిష్టానానికి సమైక్యవాద సెగ: త్వరలో ఢిల్లీకి సీమాంధ్ర నేతలు!
కాంగ్రెస్లోని సీమాంధ్ర ఎంపీలు రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు వంటి వారు కూడా మళ్లీ సమైక్య గళం విప్పుతున్నారు. సమైక్యవాదుల భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు శైలజానాథ్ గురువారం నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులందరితోనూ భేటీ కానున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ నెలాఖరులోగాని వచ్చే నెల మొదటి వారంలోగాని అధిష్ఠానాన్ని కలిసేందుకు సమయం తీసుకునే బాధ్యతను సీమాంధ్ర ఎంపీలకు శైలజానాథ్ అప్పగించారు. ఇందుకోసం అధిష్ఠానం అపాయింట్మెంట్ బాధ్యతలు లగడపాటి, అనంత వెంకట్రామిరెడ్డి, కావూరి, రాయపాటి తీసుకున్నారని తెలుస్తోంది. ఈసారి అధిష్టానాన్ని కలిసినప్పుడు రాష్ట్ర విభజన విషయాన్ని త్వరలో తేల్చమని, దానిపై నాన్చుడు ధోరణి సరికాదని అధిష్టానానికి సూచించేందుకు కూడా వారు సిద్ధమయ్యారని తెలుస్తోంది. చిదంబరం ప్రకటనతోనే రెండు వాదనలు తీవ్రస్థాయికి చేరాయని, అంతకుముందు అంత వేడి తెలంగాణలో లేకుండెనని సీమాంధ్రులు అధిష్టానానికి సూచించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
చిదంబరం రగిల్చిన వేడిని అధిష్టానమే తగ్గించాలని వారు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరే అవకాశం ఉంది. అయితే ప్రత్యేక రాష్ట్ర ప్రకటించకుండా ప్రత్యేక సహాయం, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి తోడ్పడటం తదితర నిర్ణయాలు తీసుకోవాలని వారు అధిష్టానాన్ని కోరనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి ఏదో ఒక నగరం చుట్టూనే కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకూ విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కూడా సీమాంధ్ర నేతలు కోరుతున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా తమ ఈ వాదనలనన్నింటినీ సమగ్రంగా అధిష్ఠానం ఎదుట ఉంచేందుకు వీరు సిద్ధమవుతున్నారు.