ప్రధాని పదవిని తిరస్కరించా, నీతివంతమైన పాలన ఇచ్చా: చంద్రబాబు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జైల్లో ఉండాల్సినవారు తమ పార్టీని విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని కొల్గగొట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, ప్రజలకు మేలు చేస్తామని ముందుకు వస్తున్నారని, అవినీతి సొమ్మును పంచి పెట్టి మాటలు మాట్లాడాలని ఆయన వైయస్ జగన్పై పేరు చెప్పకుండా విమర్శలు చేశారు. తమ పార్టీని విమర్శించే హక్కు చిల్లరమల్లర పార్టీలకు లేదని ఆయన అన్నారు. తన కుటుంబం చాలా చిన్నదని, కుమారుడు, భార్య కష్టపడి పని చేసి తనకు తిండి పెడుతున్నారని, తాను ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నానని, తాను రాష్ట్రానికి సేవ చేయాలని అనుకుంటున్నానని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా చేయాలని, పేదలకు మేలు చేయాలని మాత్రమే తాను అనుకుంటున్నానని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, గతంలో వెంకటేశ్వర స్వామిని, ఇప్పుడు సత్య సాయి బాబాను దోచుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కుడున్నాడో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఎంత అసమర్థులు విమర్శించినా అవినీతిపై పోరాటం ఆగదని ఆయన అన్నారు. వసూలు రాజాలు, అవినీతిపరులు కాంగ్రెసు పాలనలో రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు. ఒకప్పుడు తండ్రితో పోరాడానని, ఇప్పుడు అతని పిల్లవాడితో పోరాడాల్సి వస్తోందని, రాజకీయాల్లో తప్పదని ఆయన జగన్ను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తోడు దొంగలని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెసు పార్టీలో కలిసిపోయి ప్రజలకు తాను ఏదో చేస్తానని చిరంజీవి చెబుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లు లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పరస్పరం రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. చివరకు సత్య సాయి బాబా ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, సత్య సాయి బాబా సంపదను తరలిస్తుంటే ముఖ్యమంత్రి చూస్తూ కూర్చున్నారని ఆయన అన్నారు.