నాగంను కేర్ చేయని కెసిఆర్, రానందుకేనా?
అందుకు రెండు కారణాలు అని భావిస్తున్నారు. ఒకటి తెలంగాణ ఉద్యమాన్ని తాను తప్ప మరొకరు లీడ్ చేయడం ఇష్టం లేక పోవడం. రెండోది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాగం తనపై చేసిన విమర్శలు. అంతేకాకుండా, తమ పార్టీలోకి రావాలనే విజ్ఞప్తిని నాగం జనార్దన్ రెడ్డి ఖాతరు చేసినట్లు కనిపించలేదు. దీంతో నాగం జనార్దన్ రెడ్డిని బలహీనపరచాలనే ఆలోచన కూడా కెసిఆర్కు ఉందని అంటున్నారు. ఈ కారణాల వల్ల కెసిఆర్ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించడం లేదు.
తెలంగాణ కోసమంటూ టిడిపి నుండి బహిష్కరణకు గురైన తర్వాత నాగం పార్టీలకతీతంగా అందరినీ కలుసుకుంటున్నారు. స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు, కెసిఆర్, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, బిజెపి, సిపిఐ(ఎంఎల్) నేతలను ఆయన కలిశారు.
అయితే తెలంగాణ కోసం నాగం అందరినీ కలుస్తుంటే కెసిఆర్ మాత్రం ఆయనను ఎలా పక్కకు పెట్టాలా అనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నాగం రాకతో ఉద్యమంలో తన ప్రాధాన్యత తగ్గుతుందని కెసిఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉద్యమం నాగం చేతుల్లోకి వెళ్లకుండా ఆయనను మొదటే కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కెసిఆర్ కాంగ్రెసు నేత జానారెడ్డి తదితరులను కలిశారు. ఆ సమయంలో కెసిఆర్ నాగంను పిలవలేదు. సరికదా కనీసం ఆ విషయం కూడా చెప్పలేదని తెలుస్తోంది. దీనిపై నాగం కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.
కాంగ్రెసు నేతల ఇంటికి వెళ్లినప్పుడు నాగంను పిలిస్తే ఆయన కూడా వచ్చే వారని తెలుస్తోంది. నాగంతో ఉన్న వారు కూడా కెసిఆర్పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కెసిఆర్ నిర్లక్ష్యంపై నాగం మాత్రం తాను టిడిపిలో అన్నింటినీ వదులుకొని తెలంగాణ కోసం వచ్చానని అలాంటప్పుడు ఇలాంటివి లెక్క చేయనని చెప్పినట్టుగా తెలుస్తోంది. టిడిపిలో ఉన్నప్పుడు నెంబర్ 2గా ఉన్న నాగం ఇప్పుడు జీరో అవుతారో, హీరో అవుతారో చూడాలి. నాగం బయటకు వెళ్లిన తర్వాత జీరో అయ్యారని టిడిపి వారూ విమర్శిస్తున్నారు.