48 గంటల తెలంగాణ బంద్: జెఏసి పిలుపు
తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి 48 గంటల బందుకు తెలంగాణలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సుమారు 100 మంది రాజీనామా చేసినప్పటికీ చిదంబరం దానిని లైట్గా తీసుకొని తెలంగాణ ప్రజలకు బాధ కలిగించారని అన్నారు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు నిరవధిక సమ్మెకు సన్నద్ధం అవుతున్నాయన్నారు. తెలంగాణ నేతల రాజీనామాలపై కేంద్రం స్పందించక పోవడం బాధాకరం అన్నారు. సింగరేణి కార్మికులు కూడా బందుకు సహకరించాలని కోరారు.
కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో తెలంగాణ స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్తో పాటు కెసిఆర్ కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.