విడిపోదాం: తెలంగాణ, ఆంద్ర మేధావుల నిర్ణయం
జెఎసి నేత బెల్లయ్య నాయక్ తేజావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సామాజిక తెలంగాణ-ఆంధ్ర సమన్వయకర్త సాంబశివరావు, సీమాంధ్ర సామాజిక జెఎసి నేత పల్నాడు శ్రీరాములు, చలసాని శ్రీనివాస్, పి.శ్రీహరి, న్యాయవాది బొజ్జా తారకంతో పాటు మూడు ప్రాంతాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ సందర్భంగా సమావేశం కొన్ని తీర్మానాలు చేసింది.
ఆ తీర్మానాలు ఇలా ఉన్నాయి - 'ప్రాంతాలుగా విడిపోదాం.. ప్రజలుగా కలిసుందాం' అనే సంఘీభావ సందేశాన్ని మూడు ప్రాంతాల సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆయా ప్రాంతాల సామాజిక, ప్రజాస్వామిక మేధావులతో, సామాజిక ప్రజాసంఘాల ప్రతినిధులతో తెలంగాణ సీమాంధ్ర సమన్వయ సమితిని ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర బిల్లు వెంటనే పార్లమెంట్లో పెట్టాలి. అందుకు అడ్డుపడే సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రల్ని తిప్పికొట్టడానికి సీమాంధ్ర ప్రజాస్వామ్య వాదులు కృషి చేయాలి. సామాన్య ప్రజల్లోకి సంఘీభావ సందేశాన్ని తీసుకెళ్లడానికి ఉమ్మడిగా సభలు, సదస్సులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజలు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకమని సమైక్యవాదులు చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టడానికి జాతీయస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలి.