తెలంగాణ కోసం టి-కాంగ్రెసు నిరాహార దీక్ష
తెలంగాణ తెలుగుదేశం పార్టీ తమతో పనిచేసేందుకు సిద్దపడినా తాము అందుకు సిద్ధంగా లేమని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బస్సు యాత్రను, సీమాంధ్రలో పాదయాత్రను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ముందు తన వైఖరి బయట పెట్టాలన్నారు. ఉద్యమంలో టిడిపితో వెళ్లే ప్రసక్తి లేదన్నారు. ఎర్రబెల్లి తమతో కలుస్తామని చెప్పినా మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. కాంగ్రెసుకు, టిడిపికి సంబంధం లేదన్నారు. మంత్రులు ఎవరూ సచివాలయానికి వెళ్లడం లేదని అన్నారు. అధిష్టానం తెలంగాణ ప్రకటించే వరకు ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణే తమ అంతిమ లక్ష్యం అన్నారు. విద్యార్థుల దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వంతో, పార్టీతో తాము తెగతెంపులు చేసుకోలేదన్నారు. ఒత్తిడి తెచ్చేందుకే తాము రాజీనామాలు చేశామని చెప్పారు.
తెలంగాణ ఉద్యమాన్ని కొందరు అవహేళన చేస్తున్నారని మరికొందరు తక్కువ చేసి చూపిస్తున్నారని ఇది సరికాదని మంత్రి జానారెడ్డి అన్నారు. మీడియా ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా చేయాలని సూచించారు. ప్రాంతాలుగా రాష్ట్రం విడిపోయినప్పటికీ మానసికంగా కలిసే ఉందామని జానారెడ్డి సీమాంధ్రులకు సూచించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులం కాంగ్రెసు పార్టీని కాపాడుకుంటూ, ప్రభుత్వాన్ని కాపాడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామన్నారు. ప్రజాభీష్టాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతోనే తాము సహనంతో వెళుతున్నామని అన్నారు. కాంగ్రెసు పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదన్నారు. మంత్రులు సైతం తెలంగాణ ఉద్యమంలో తమతోనే ఉన్నారని కొన్ని కారణాల వల్ల వారు కార్యక్రమాలలో పాల్గొననప్పటికీ వారు ప్రజల వెంటే ఉన్నారని అన్నారు. మహాభారతంలో వలె మాది ధర్మయుద్ధం అని చెప్పారు.