బాబుకు తలనొప్పి: తెలంగాణ సెగ, అలిగిన మోత్కుపల్లి
బస్సు యాత్ర తీరుపై నల్లగొండ జిల్లా శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అలక వహించారు. చంద్రబాబు నాయుడిని కొంత మంది తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తాను తెలంగాణ బస్సు యాత్రలో పాల్గొనబోనని ప్రకటించారు. టిడిపి సహా అన్ని పార్టీల్లో మాలలకు అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన బాధ్యతారహితమైందని ఆయన వ్యాఖ్యానించారు. తనకు అవమానం జరుగుతోందని ఆయన అంటున్నారు.
మోత్కుపల్లితో చంద్రబాబు సంప్రదింపులు జరిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ప్రతినిధి ఒకరు మోత్కుపల్లి నర్సింహులుతో మాట్లాడారు. కానీ ఆయన వెనక్కి తగ్గడానికి నిరాకరిస్తున్నారు. నల్లగొండ జిల్లా బస్సు యాత్ర రూట్ మ్యాపులో ఎర్రబెల్లి దయాకర్ రావుకు, మోత్కుపల్లి నర్సింహులుకు మధ్య విభేదాలు తలెత్తాయి. అవి ముదిరి పాకాన పడ్డాయి.