తెలంగాణలో ఆంధ్ర నేతల పెట్టుబడులు!
హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన లగడపాటి, రాయపాటి, మేకపాటి, కావూరి తదితరులే తెలంగాణకు అడ్డు పడుతున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టే ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందని సీమాంధ్ర పారిశ్రామిక వేత్తలు వాదిస్తున్నారు. ఈ వాదోపవాదాల సంగతి పక్కనపెడితే సీమాంధ్రకు చెందిన రాజకీయ - పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో, అందునా హైదరాబాద్లో వేలకోట్ల పెట్టుబడులు పెట్టడం నిజం.
ఇలా పెట్టుబడులు పెట్టిన వారిలో తెలంగాణకు చెందిన వారూ ఉన్నారు. రాజకీయ నాయకులుగా మారిన పారిశ్రామిక వేత్తలు, పారిశ్రామిక వేత్తల అవతారమెత్తిన రాజకీయ నాయకులు అనేకులు హైదరాబాద్ చుట్టూ వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. ఎంపిలు టి.సుబ్బిరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రవేఖర్ రెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎంపి రాజగోపాల్ రెడ్డి, మరో జి.వివేకానంద, టిడిపి ఎంపి నామా నాగేశ్వరరావులు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. ఇలా తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో ఎవరు ఏయే ప్రాజెక్టులపై, ఏ మేరకు పెట్టుబడులు పెట్టారో తెహల్కా ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. సీమాంధ్ర నేతల సమైక్యవాదానికి, హైదరాబాద్తో వారి ప్రయోజనాలకు ముడిపెట్టింది. దీనిని ఆదివారం ఓ పత్రిక ప్రచురించింది. హైదరాబాదే రాంకీ తెలుగుదేశం పార్టీ ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి నర్సరావుపేట చెందిన రాంకీ గ్రూప్ పంచ ప్రాణాలు హైదరాబాద్తో ముడిపడి ఉన్నాయి.
రాంకీ సంస్థ తెలంగాణలో 6300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. రాంకీ ప్రాజెక్టుల్లో అత్యంత ముఖ్యమైనది డిస్కవరీ సిటీ. రంగారెడ్డి జిల్లాలో శ్రీశైలం హైవేలో తలపెట్టిన డిస్కవరీ సిటీని పుణెలోని లావసా ప్రాజెక్టుతో పోల్చవచ్చు. ఇది పూర్తయితే లక్షమందికి ఉపాధి కలుగుతుందని ఒక అంచనా. అయితే హైదరాబాద్ సిటీ భవిష్యత్తుపైనే డిస్కవరీ సిటీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 72 నోటిఫైడ్ సెజ్లు ఉండగా అందులో 40 రాజధాని పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. మిగిలిన మొత్తం తెలంగాణలో మూడంటే మూడు మాత్రమే ఉన్నాయి. ఇక బడా బడా పారిశ్రామిక వేత్తలను పక్కనపెడితే చిన్న, మధ్య తరహా వ్యాపార కోణంలో చూసినా రాష్ట్ర సరిహద్దులను నిర్ణయించడం చాలా కష్టమైన వ్యవహారమని తెహల్కా పేర్కొంది. వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కలగలిసిన నేపథ్యంలో ఈ పీటముడి విడివడటం కష్టమేనని అభిప్రాయపడింది. సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలన్నీ తెలంగాణతోనే ముడిపడి ఉన్నాయా? సీమాంధ్ర రాజకీయ నాయకులు ఒక ఉప ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. జాతీయ స్థాయిలోనూ లక్షల డాలర్ల కాంట్రాక్టులను చేపట్టారు. కాబట్టి అది సమస్య కాదని కూడా చెప్పింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన మన నేతలు... కాంగ్రెసు ఎంపీలు టి సుబ్బిరామిరెడ్డి గాయత్రీ సంస్థ ద్వారా రూ.4900 కోట్లు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు ల్యాంకో గ్రూపు ద్వారా లగడపాటి రాజగోపాల్ రూ.5500 కోట్లు, రాయపాటి సాంబశివ రావుకావూరి ట్రాన్సు ట్రాయ్ ఇండియా పేరుతో సుమారు రూ.745 కోట్లు, కావూరి సాంబశివరావు ప్రోగ్రెసివ్ కన్ట్రక్షన్ పేరుతో భారీగానే పెట్టుబడులు పెట్టినట్లుగా చెప్పారు. ఇక జగన్ వర్గంలో ఉన్న మేకపాటి సోదరులు సుమారు రూ.800 కోట్లకు పైగా, టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాల్ రాంకీ గ్రూపు పేరుతో సుమారు రూ.6400 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు ఎంపీలు వివేక్ రూ.ఐదువందల కోట్లకు పైగా, కోమటిరెడ్డి సోదరులు రెండువందల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ హైదరాబాదులోనే ప్రముఖంగా పెట్టారు.