విహెచ్ హైదరాబాద్ ప్రతిపాదన అధిష్టానం మాటేనా?
సీమాంధ్రులు ప్రతిపాదించినప్పుడే దీనికి ఒప్పుకొని ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా నాలుగైదేళ్లు గడిచి పోయేది. కానీ ఉమ్మడి రాజధానికి ససేమీరా అన్న తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పుడు అదే విషయాన్ని తెరపైకి తీసుకు రావడం వెనుక ఆ పార్టీ అధిష్టానం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ కోసం టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేసినప్పటికీ విహెచ్ చేయలేదు. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని, అయితే అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ సాధిస్తామని చెప్పారు. విహెచ్ అధిష్టానానికి చాలా దగ్గర కావటం వల్ల తన మాటను ఆయనతో అధిష్టానం చెప్పించి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలోనే పదేళ్లు ఉమ్మడి రాజధాని ప్రతిపాదన వచ్చినట్లుగా భావిస్తున్నారు.
అయితే అప్పుడే బహిర్గతం చేస్తే టి-కాంగ్రెసు అధిష్టానం ఒత్తిడికి లొంగిపోయిందనే ఆరోపణలు వెలువడుతాయనే ఉద్దేశ్యంతోనే కాస్త ఆలస్యంగా ఇప్పుడు బహిర్గతం చేసినట్లు పలువురు భావిస్తున్నారు. ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ద్వారా ఇటు తెలంగాణలో కాస్త వాతావరణాన్ని చల్లబర్చడమే కాకుండా, సీమాంధ్రులలో ఉన్న అభిప్రాయాలు సైతం బహిర్గతమయ్యే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని అంటే ఇటు సీమాంధ్రులు, అటు తెలంగాణవాదులు ఎలా స్పందిస్తారో చూడాలనే ఉద్దేశ్యంతోనే విహెచ్తో ఆ ప్రతిపాదన బహిర్గతం చేసినట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ నుండి ఈ ప్రతిపాదనకు సానుకూల సంకేతాలు వస్తే ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.