యెడ్యూరప్ప అవుట్: సిఎం పీఠంపై ఈశ్వరప్ప, షెట్టార్?
ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టడానికి అధిష్టానం జగదీష్ షెట్టార్, ఈశ్వరప్ప పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో అధిష్టానం ఈ విషయంపై తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. యెడ్డీ వ్యతిరేక వర్గం నేత అనంతకుమార్ సిఎం పీఠం కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ యెడ్డీ ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. సిఎంను మార్చాల్సి వస్తే తాను సూచించిన వ్యక్తినే పీఠంపై కూర్చుండ బెట్టాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. అంతకుముందు తాను పదవి నుండి దిగేది లేదని, కావాలంటే తనపై ఓ కమిటీ వేసుకోవచ్చునని ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి లేఖ కూడా రాశారు. అయితే పార్టీ, ప్రభుత్వం భవిష్యత్తు దృష్ట్యా యెడ్డీకి ఉద్వాసన తప్పని పరిస్థితుల్లోనే అధిష్టానం మరో వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. షెట్టార్, ఈశ్వరప్పలలో ఎవరో ఒకరి పేరు త్వరలో ఖరారు చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.