యడ్యూరప్ప షాక్, కర్ణాటక బిజెఎల్పి వాయిదా
బిజెఎల్పి సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు యడ్యూరప్ప వర్గానికి చెందిన దాదాపు 50 మంది శాసనసభ్యులు, 12 మంది పార్లమెంటు సభ్యులు కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచారు. లోకాయుక్త నివేదికపై ఆధారపడి యడ్యూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడం సరి కాదని వాదించారు. యడ్యూరప్పను తొలగించడం వల్ల పార్టీ దెబ్బ తింటుందని వారు చెప్పారు. ఏడాది పాటు పోరాటం చేస్తే తప్ప 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఎ. రాజాను అరెస్టు చేయలేదని, యడ్యూరప్ప విషయంలో ముందే చర్యలు తీసుకోవడం సరి కాదని వారు వాదిస్తున్నారు.
కాగా, పార్టీ కేంద్ర నాయకత్వం ప్రతినిధులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ బెంగళూర్కు చేరుకున్నారు. అరుణ్ జైట్లీని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప, మంత్రులు అశోక్, జగదీషెట్టర్ తదితరులు కలుసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో యడ్యూరప్ప వర్గానికి చెందిన శాసనసభ్యుల సమావేశం కూడా వాయిదా పడింది.