జగన్ పార్టీలోకి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి?
వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసులోని కొంత మంది బురద చల్లుతున్నారనే ఆవేదనకు ఆయన గురైనట్లు చెబుతున్నారు. ఆయన గురువారంనాడు వైయస్ జగన్తో వైయస్సార్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు. వేదికపై జగన్ పక్కనే కూర్చున్నారు. ఇరువురూ కలిసి వైయస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. దీన్నిబట్టి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకుని జగన్తో కలిసి నడిచే ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఒక వేళ వైయస్ జగన్ జైలుపాలైతే వదిన వైయస్ విజయమ్మకు తోడుగా నిలిచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నడపడంలో వివేకానంద రెడ్డి సహకరించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ను దెబ్బ కొట్టేందుకు వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ డ్యామేజీ చేయాలని ప్రయత్నించడం బాధాకరమని ఆయన అన్నారు. అవినీతి తమ ఇంటా వంటా లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్పై కాంగ్రెసు నాయకుల వేధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఏది ధర్మమో, ఏది న్యాయమో దేవుడే నిర్ణయిస్తాడని ఆయన అన్నారు. గత ప్రభుత్వ కేటాయింపులకు వైయస్ జగన్ ఆస్తులకు ఏ విధమైన సంబంధం ఉంటుందని ఆయన అడిగారు.