లాభపడే దిశలో బిజెపి, అన్నాకు దేశవ్యాప్తంగా మద్దతు
అన్నా హజారేకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. హైదరాబాదులోని వనస్థలిపురంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కూడా ఆందోళన చెలరేగింది. ఈ ఆందోళన కార్యక్రమాల్లో బిజెపి నాయకులు ప్రధాన పాత్ర పోషించారు. బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ వంటి నాయకులు పాల్గొన్నారు.
తాను జైలులో కూడా నిరాహారదీక్ష చేస్తానని హజారే చెబుతున్నారు. అవినీతి భూతం అంటే ఏమిటో ప్రజలకు తెలిసిందని ఆయన అన్నారు. అన్నా హజారేను తీహార్ జైలుకు తరిలించారు. దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకాయి. జెపి పార్కు వద్ద పోలీసులు అన్నా మద్దతుదారులను అరెస్టు చేశారు. నేడు, రేపు శాంతి ర్యాలీలు జరుగతాయని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. అన్నా అరెస్టును యోగా గురు రామ్దేవ్ బాబా, ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ ఖండించారు.
అన్నా హజారే అరెస్టును ప్రభుత్వం సమర్థించుకుంది. అరెస్టులో తమ పాత్ర ఏమీ లేదని కేంద్ర మంత్రి అంబికా సోనీ అన్నారు. అన్నా అరెస్టును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఖండించారు. అన్నా సొంత గ్రామంలో ప్రజలు బంద్ పాటించారు.