సిబిఐ దాడులపై ప్రధానికి వైయస్ విజయమ్మ లేఖ

భారమైన హృదయంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున తాను వ్యక్తిగతంగా ఈ లేఖ రాస్తున్నట్లు ఆమె తెలిపారు. ఐదు పేజీలో సుదీర్ఘమైన లేఖను ఆమె రాశారు. వేలాది కేసులు పెండింగులో ఉన్నప్పటికీ జగన్ ఆస్తుల వ్యవహారంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావు కల్పిస్తోందని ఆమె విమర్శించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి విధేయుడిగా ఉన్నప్పుడు నిజాయితీపరుడిగా ఉన్న జగన్ ఇప్పుడు అవినీతిపరుడైపోయాడా అని ఆమె ప్రశ్నించారు. జగన్కు లభిస్తున్న ప్రజాదరణను దెబ్బ తీయడానికే ఈ దాడులు చేస్తున్నారని స్పష్టమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
అన్నా హజారేలాంటి వ్యక్తిపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటే కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఏమైనా చేస్తారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని విజయమ్మ అన్నారు. ఆదర్శ్ కుంభకోణంపై కూడా జరిగిందని, అయితే ఆ వ్యవహారంలో ఇప్పటి వరకు సిబిఐ దాడులు జరిగాయా అని ఆమె అన్నారు. చట్టాలు అందరికీ ఒకే విధంగా వర్తించవా అని ఆమె అడిగారు. రెండు ఎకరాల ఆసామి చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయలకు ఎలా అధిపతి అయ్యాడని ఆమె ప్రశ్నించారు. కిందిస్థాయి నుంచి వచ్చిన అంబానీ, ఉపేంద్ర కుటుంబసభ్యులు ఎలా ధనవంతులయ్యారని ప్రశ్నించారా అని ఆమె అడిగారు. వోక్స్ వ్యాగన్ కేసులో అప్పటి మంత్రి ఇళ్లపై దాడులు చేశారా అని బొత్స సత్యనారాయణను ఉద్దేశించి ఆమె అన్నారు. వోక్స్ వ్యాగన్ కేసులో సిబిఐ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆమె విమర్శించారు. మంత్రితో మాట్లాడి కేసు మూసేశారని ఆమె ఆరోపించారు.
బోఫోర్స్ కేసులో రాజీవ్, సోనియా గాంధీ ఇళ్లను ఫైళ్ల కోసం సోదాలు చేశారా అని ఆమె అడిగారు. బోఫోర్స్ సూత్రధారి ఖత్రోచి సోనియా గాంధీకి ఆప్తులు కారా అని ఆమె అడిగారు. ప్రత్యర్థులను ఓడించలేనప్పుడు ఇతర మార్గాల్లో దెబ్బ తీయడమే కాంగ్రెసు సిద్ధాంతమా అని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications