అమ్మ, ఇన్ఫోసిస్యే మానాన్న ప్రపంచం: రోహాన్ మూర్తి
శుక్రవారం మూర్తి సతీమణి సుధామూర్తి పుట్టిన రోజు కూడా. శనివారం నారాయణమూర్తి జన్మదినం. మూర్తి మరో ఆరుగురితో కలసి 30 సంవత్సరాల కిందట ఇన్ఫోసిస్ను స్థాపించిన విషయం విదితమే. ఇప్పుడిక మూర్తి ఇన్ఫోసిస్కు గౌరవ ఛైర్మన్గా ఉంటారు. కాగా రోహన్ తన ప్రసంగంలో మా నాన్నకు తన జీవనంలో ఉద్వేగభరితమైన అంశాలు రెండే రెండు ఉన్నాయి.. ఒకటి మా అమ్మ, రెండోది కంపెనీలోని మీరంతా' అన్నారు. నాకు తెలిసి మా నాన్న రాత్రింబగళ్లు, ప్రతి సోమవారం నుంచి ప్రతి ఆదివారం వరకు ఎప్పుడూ ఒక యంత్రంలానే పనిచేశారు. ఆఫీసుకు వెళ్లినపుడల్లా ఉత్సాహంతో, నూతన జవసత్వాలతోనూ వెళ్లే వారు.
ఒక్కోసారి ఇంటికి అలసిపోయి వచ్చినా ఆయనలో సత్తువ ఇంకా మిగిలే ఉండేది. ఉద్యోగులతో కలసి శ్రమించడానికే సన్నద్ధంగా ఉండే వారు. ఆయనలోని ఉత్తేజమే పరోక్షంగా మా గృహ వాతావరణాన్ని మెరుగుపర్చడానికి తోడ్పడింద''న్నారు. మా నాన్నకు సంతోషాన్ని అందించిన మీ అందరికీ మా కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రోహన్ అన్నారు. ఇదే సందర్భంగా ఇన్ఫోసిస్ సహ-ఛైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్, కార్యనిర్వాహక సహ-ఛైర్మన్ ఎస్.డి.శిబులాల్, నూతన ఛైర్మన్ కె.వి.కామత్లు నారాయణమూర్తి నాయకత్వ పటిమను గురించి, ఆయన దార్శనికతను గురించి, ఆయన అనుసరించిన కార్పొరేట్ పరిపాలన తీరుతెన్నులను గురించి వారి అభిప్రాయాలను వెల్లడించారు.
మూర్తి వారసత్వాన్ని ఇన్ఫోసిస్ మున్ముందుకు తీసుకువెళ్తుందని కామత్ వాగ్దానం చేశారు. ఇది ఇలా ఉంటే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ టెలిఫోన్ ద్వారా తన శుభాకాంక్షలు అందజేయడం విశేషం. ఇన్ఫోసిస్ను ప్రపంచ స్థాయి కంపెనీగా గేట్స్ కొనియాడారు. భారత్లో ఉన్న నమ్మశక్యం కాని ప్రతిభకు ఇన్ఫోసిస్ అద్దం పట్టిందంటూ, మూర్తి నాయకత్వ ప్రతిభను ప్రశంసించారు.