చిరంజీవికి వంగవీటి రాధాకృష్ణ షాక్, కాంగ్రెసులోకి నో
వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీగా ఇస్తామనే హామీని చిరంజీవి ఇవ్వకపోవడంతో వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. బేషరతుగా కాంగ్రెసు పార్టీలో చేరాలని, ఆలా చేరిన తర్వాత రాజకీయ భవిష్యత్తు గురించి తగిన సమయంలో ఆలోచన చేస్తానని చిరంజీవి రాధాకు చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు నుంచి మల్లాది విష్ణు విజయవాడ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో తనకు టికెట్ రాకపోవచ్చుననే అనుమానాలు రాధాలో ఉన్నాయి.
విజయవాడు నగరం నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం ఖాయం. దానివల్ల కూడా వచ్చే ఎన్నికల్లో తనకు కాంగ్రెసు టికెట్ లభించడం కష్టమే అవుతుందని రాధా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రి గల్లా అరుణుకుమారితో రాధాకు సత్సంబంధాలున్నాయి. అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలస్యంగానైనా రాధా కాంగ్రెసు పార్టీలోకి రావచ్చునని అంటున్నారు.