గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు: మీడియాపై జగన్ గుస్సా

గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు గురించి అభిప్రాయాలు కావాలంటే బిజెపి నాయకుల వద్దకో, కర్ణాటక రాష్ట్రానికో వెళ్లాలని, తన వద్దకు రావడం సరి కాదని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి మీకు సన్నిహితులని అంటున్నారని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా ఇది సరైంది కాదని, గాలి జనార్దన్ రెడ్డి అరెస్టును తనకు ముడిపెట్టడం బెల్టు కింద కొట్టడమేనని, మీడియా కనీస నైతికతను పాటించకపోవడమేనని ఆయన విరుచుకుపడ్డారు. తాను చెప్పాల్సింది చెప్పేసి ఆయన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. ఢిల్లీలో మద్దతు కూడగట్టుకోవడానికి ఎవరెవరిని కలుస్తున్నారని మీడియా అడుగుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గాలి జనార్దన్ రెడ్డితో తనకేమీ సంబంధం లేదని, గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు గురించి బిజెపిని అడగాలని ఆయన అన్నారు. తన కేసు విషయానికి వస్తే సిబిఐ సరైన దిశలో పోవడం లేదని, సిబిఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. సిబిఐని కక్ష సాధించడానికి కాంగ్రెసు పనిముట్టుగా వాడుకుంటోందని ఆయన అన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి 30 ఏళ్ల రాజకీయ జీవితంలో బిజెపిని వ్యతిరేకించారని, కాంగ్రెసుకు విధేయంగా పని చేశారని, అయినా కాంగ్రెసు వైయస్ పట్ల అనుచితంగా ప్రవర్తించిందని ఆయన అన్నారు. తాను బిజెపితో కలిసి పనిచేసే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.
తనకు జరిగిన అన్యాయాన్ని బిజెపి నాయకులు ప్రశ్నించారని, తాను మద్దతు ఇవ్వకపోయినా జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించింనందుకు బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రధాని సహా ప్రతిపక్ష నాయకులందరినీ కలుస్తానని ఆయన చెప్పారు. తన తండ్రి వైయస్ను అప్రతిష్టపాలు చేసేందుకే సిబిఐ దర్యాప్తు ద్వారా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సిబిఐ తీరుపై తాను ఓ నోట్ తయారు చేశానని, దాన్ని నాయకులందరికీ ఇస్తానని, మీడియాకు ప్రకటన కూడా విడుదల చేస్తానని ఆయన చెప్పారు. ఈ రోజు సమాజ్వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ను కలుస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications