గాలికి కోర్టులో చుక్కెదురు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ
గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ కస్టడీకి అప్పగించాలనే పిటిషన్పై ఆరు రోజుల పాటు సుదీర్ఘంగా కోర్టులో వాదనలు సాగాయి. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డికి కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయనను కూడా సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి కస్టడీ పిటిషన్పై సోమవారం సాయంత్రం వాదనలు పూర్తయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ కోరుతూ హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు.
కాగా, గాలి జనార్దన్ రెడ్డిని మంగళవారం సిబిఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను చంచల్గుడా జైలు నుంచి హైదరాబాదులోని కోఠీలో గల సిబిఐ కార్యాలయానికి తరలించారు. ఆయనతో పాటు శ్రీనివాస రెడ్డిని కూడా సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. సహకరిస్తే గాలి జనార్దన్ రెడ్డికి సత్య పరిశోధన చేస్తామని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. మీడియా సహకరించాలని ఆయన కోరారు. గాలి జనార్దన్ రెడ్డి కస్టడీ సరిపోదని భావిస్తున్నామని, మరిన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతామని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉందని ఆయన అన్నారు. అవసరమైతే ప్రైవేట్, ప్రభుత్వ వ్యక్తులను విచారిస్తామని ఆయన చెప్పారు. మరిన్ని సోదాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. అవసరమైతే కేసు వివరాలు ఎప్పటికప్పుడు మీడియాకు వివరిస్తామని ఆయన చెప్పారు.