కాంగ్రెసు, టిడిపి తెలంగాణ నేతలపై కెటిఆర్ ఫైర్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఎంగిలి మెతుకులు కావాలో తెలంగాణ తల్లి బువ్వ కావాలో తేల్చుకోవాలని ఆయన వారిని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై 177 జీవోను ప్రయోగిస్తే ఏం చేస్తారో తెలంగాణ కాంగ్రెసు మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్పాలని ఆయన కోరారు. ఏ ఒక్క ఉద్యోగిపై చర్య తీసుకున్నా అందుకు తెలంగాణకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెరాసను మేనేజ్ చేయవచ్చునని కేంద్రం భావిస్తోందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎవరు మేనేజ్ అయ్యారో అందరికీ తెలుసునని, మిగతా వారంతా పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉంటే ఎవరు పార్లమెంటుకు హాజరయ్యారో కూడా తెలుసునని ఆయన అన్నారు. మధుయాష్కీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణలో సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతోందని ఆయన చెప్పారు. సచివాలయంలోని అధికారులకు జిల్లాల నుంచి నివేదికలు అందే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కలెక్టర్లు కూడా టెలీ కాన్ఫరెన్స్కు అందుబాటులో లేక రెవెన్యూ మంత్రి రఘువీరా రెడ్డి ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన అన్నారు.