తెలంగాణ సమ్మె, బొగ్గుకు కటకటతో విద్యుత్ కష్టాలు
ప్రస్తుత సంకట స్థితిలో విద్యుత్ కోతలను అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. ఇళ్ల వాడకానికి పగలు పల్లెల్లో 8 గంటలు, మండల, మునిసిపాలిటీ కేంద్రాల్లో 4 గంటలు, జిల్లా కేంద్రాల్లో 2 గంటల పాటు కోతలను అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతానికి పరిశ్రమలకు కోత విధించరు. సమ్మె పదిరోజులు దాటితే పరిశ్రమలకు కూడా విద్యుత్ కోత విధిస్తామని, సమ్మె తీవ్రత ఇంకా ఉంటే వ్యవసాయానికి ఇచ్చే 7గంటల ఉచిత విద్యుత్తును కూడా సరఫరా చేయలేమని విద్యుత్శాఖ వర్గాలు చేతులెత్తేస్తున్నాయి.
ప్రభుత్వం ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచన చేస్తోంది. గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు ప్రస్తుతం 75% గ్యాస్నే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో 100% గ్యాస్ను సరఫరా చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్రెడ్డిని సీఎం కిరణ్కుమార్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్ర గ్రిడ్లో ఎవరికీ కేటాయించని విద్యుత్తును కూడా రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర విద్యుత్ శాఖను రాష్ట్రప్రభుత్వం కోరింది. అవసరాన్ని బట్టి బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
రామగుండం ఎన్టీపీసీకి ఛత్తీస్గఢ్ కోర్బా యూనిట్ నుంచి బొగ్గును తరలించాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ట్రాన్స్కో కోరింది. రాష్ట్రప్రభుత్వానికి చెందిన బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థలకు బొగ్గు కొరత లేకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు జెన్కో డైరెక్టర్ (కోల్) ప్రభాకరరావు తెలిపారు. అందుబాటులో ఉన్న విదేశీ బొగ్గును కొనుగోలు చేసి విజయవాడ థర్మల్ కేంద్రానికి, కొత్తగూడెం థర్మల్ కేంద్రానికి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.