జెఏసి చైర్మన్ కోదండరామ్ అరెస్టు, విడుదల
కోదండరాంను పోలీసులు హైదరాబాదు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కోదండరాం అరెస్టును తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కాంగ్రెసు సీనియర్ నేత కె కేశవరావు, ఎంపీ విజయశాంతి తదితరులు ఖండించారు. అరెస్టు విషయం తెలిసిన తెలంగాణవాదులు ఆలేరు, భువనగిరి రహదారిపై బైఠాయించారు. కోదండరాంను హైదరాబాదు తరలించకుండా అడ్డుకుంటామని పోలీసులను హెచ్చరించారు. దీంతో హైదరాబాద్ - వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ తాము శాంతియుతంగా ఉద్యమిస్తుంటే తనను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఉద్యమకారులను ప్రభుత్వం రెచ్చగొడుతుందని విమర్శించారు. ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలన్నారు.
కాగా కోదండరాంను హైదరాబాదు తరలిస్తుండగా నల్గొండ జిల్లా ఆలేరు గ్రామంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆలేరు, భువనగిరి, ఘట్కేసర్ తదితర గ్రామాల్లో భారీగా తెలంగాణవాదులు పోలీసులను అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆలేరులోనే భారీగా గుమికూడిన తెలంగాణవాదులు ఎంతకూ పోలీసులు వాహనాన్ని కదలనివ్వక పోవడంతో దిగొచ్చిన పోలీసులు కోదండరాంను విడుదల చేశారు. అయితే తనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ కోదండరాం రోడ్డుపైనే బైఠాయించారు. తన అరెస్టుకు తెలంగాణవాదులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.