అనుకూలం కాకపోతే ఆమరణ దీక్ష: కెకె
హైదరాబాద్: అధిష్టానం నుండి తెలంగాణకు అనుకూలంగా త్వరలో ప్రకటన రాకపోతే తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులమంతా ఆమరణ దీక్షకు దిగుతామని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఆదివారం హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న సకల జనుల సమ్మెకు తెలంగాణ కాంగ్రెసు పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. సింగరేణి బస్సు యాత్ర ద్వారా చేపట్టిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ అరెస్టును కెకె ఖండించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణిచి వేయాలని చూడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తదుపరి చేసే ప్రకటన 2009 డిసెంబర్ 9 ప్రకటనలా కాకుండా ఈసారి స్పష్టంగా ఉండాలన్నారు. కేంద్రం తెలంగాణ ప్రక్రియ ప్రారంభించిందని అనధికారికంగా తెలుస్తోందని అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో సంప్రదింపులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.