రాష్ట్రంలో పరిపాలనా విరామం: వెంకయ్య నాయుడు సెటైర్
కేంద్ర ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలతో విసిగిపోయి, ధరల పెరుగదలతో తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలు యూపీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పలేదని యూపీఏ భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్పవారే వ్యాఖ్యానించారని.. మరోవైపు అద్వానీ రథయాత్ర విజయవంతమైందని చెప్పారు. వీటిని బట్టి చూస్తే కాంగ్రెస్కు వ్యతిరేక, బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఎప్పుడైనా మధ్యంతరం వచ్చే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులు అందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గురువారం అన్నారు.
కేంద్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతోంది. యూపీఏ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల నుంచి పెట్రోలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిష్క్రియాపరత్వంతో రైతులు పంట విరామాన్ని ప్రకటించుకునే దుస్థితి నెలకొంది. యూపీఏను గద్దె దించి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఎప్పుడు గద్దెనెక్కించాలా అని ప్రజలు ఆతృతపడుతున్నారన్నారు. ఇప్పటికే ప్రజలు ఎన్డీఏ హయాంలో చేపట్టిన పథకాలను మననం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే కాంగ్రెస్కు వ్యతిరేక, బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నది స్పష్టమవుతోందన్నారు. మనపార్టీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారితో మరింత మమేకం కావాలన్నారు.