తెలంగాణ దీక్షలు: ఢిల్లీలో బాపూజీ, నల్లగొండలో కోమటిరెడ్డి
కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ, తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి ప్రాణహాని కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు కూడా తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు.
కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాదులోని తన ఇంటి నుంచి బయలుదేరి నల్లగొండకు చేరుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్య ఆయనకు ఎదురుగా వచ్చారు. ఆయన నల్లగొండలోని ఆంజనేయ స్వామికి ప్రార్థనలు చేసిన తర్వాత దీక్షాస్థలికి చేరుకున్నారు. ఆయన వెంట పెద్ద యెత్తున అనుచరులు నల్లగొండ క్లాక్ టవర్కు చేరుకున్నారు. అక్కడే ఆయన తన ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు.