చిరంజీవికి వైయస్ జగన్ ఎసరు, అంచనాలో కాంగ్రెసు?

శరద్ పవార్ ఎన్సీపి మాదిరిగా, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెసు లాగా తన పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన చెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెసుతో స్నేహాన్ని ఖరారు చేసుకోవడానికే జగన్ తన ఢిల్లీ పర్యటనను పొడగించుకున్నట్లు వినికిడి. ఆయన కేంద్ర మంత్రి, ఎన్సీపి నేత శరద్ పవార్తో మంగళవారం సమావేశమయ్యారు. రైతు సమస్యలపైనే జగన్ సమావేశమైనట్లు చెప్పుకున్నప్పటికీ కాంగ్రెసుతో స్నేహ ప్రతిపాదన కోసం అవసరమైన చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. అలాగే, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజీవ్ శుక్లాతో జగన్ సమావేశం కావడం వెనక ఆంతర్యం కూడా ఇదేనని అంటున్నారు.
జగన్ కాంగ్రెసులోకి ప్రవేశిస్తే చిరంజీవి స్థానం డోలాయమానం కావచ్చునని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని, తాను మరో సామాజిక వర్గానికి చెందిన మాస్ లీడర్ను కాబట్టి తనకు నికార్సైన ఓటు బ్యాంకు ఉందని, దానివల్లనే కాంగ్రెసుకు లాభం చేకూరుతుందని చిరంజీవి చెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, సమైక్యాంధ్ర నినాదం పుచ్చుకున్న చిరంజీవి దాదాపుగా తెలంగాణకు దూరమైనట్లే. అందుకు భిన్నంగా వైయస్ జగన్ వర్గం తెలంగాణలో నిర్మాణాత్మకంగా పార్టీని బలోపేతం చేసే పనికి పూనుకుంది. చిరంజీవి సీమాంధ్ర నాయకుడైతే, జగన్ రాష్ట్ర నాయకుడని చెప్పుకోవడానికి తగిన రంగాన్ని జగన్ వర్గీయులు తయారు చేస్తున్నారు. అయితే, ఈ ఇద్దరిలో ఎవరైతే తమకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనే విశ్లేషణలో కాంగ్రెసు పెద్దలు పడినట్లు చెబుతున్నారు. ఈ పథకాన్ని కాంగ్రెసు అధిష్టానం 2014లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications