టార్గెట్ టిడిపి, కాంగ్రెస్: చేతులు కలిపిన కెసిఆర్, జగన్?
ఇద్దరి లక్ష్యాలు వేరైనా ఇద్దరి ప్రత్యర్థులు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే కాబట్టి ఆ పార్టీలను దెబ్బతీసేందుకు ఇరువురు అంతర్గతంగా పరస్పర సహకారంతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. విడి విడి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అంతిమంగా సీమాంధ్రలో జగన్, తెలంగాణలో కెసిఆర్ నిలదొక్కుకునే దిశలో వారు ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. పరకాల శాసనసభ్యురాలు, జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు కూడా కొంత అనుమానాలకు తావిస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఘంటాపథంగా చెబుతుంటే కొండా సురేఖ మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇంకా గుర్తు రానందున తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశముందని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తే తెలంగాణవాదులు రాష్ట్ర విభజనపై జగన్ను ప్రశ్నించే అవకాశముంది. తాను తెలంగాణ కోసమే మొదట రాజీనామా చేశానని సురేఖ చెబుతున్నందున, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలపకుండా ఆమెకు మద్దతు పలికే అవకాశముందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రాంతంతో పాటు ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదు కాబట్టి జగన్, కెసిఆర్ పక్కా వ్యూహంతో వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.