ఆ సెక్షన్ నాకు వర్తించదు: కోనేరు ప్రసాద్ కొత్త వాదన
409 సెక్షన్పై అభ్యంతరాలుంటే హైకోర్టులో సవాల్ చేసుకోవచ్చునని... దర్యాప్తు ఒక దశ వరకు వచ్చాక ఆ సెక్షన్ గురించి మాట్లాడటం సరికాదని తెలిపారు. కోనేరు తరపున చెన్నై నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది బి.కుమార్ తన వాదనలు వినిపించారు. "కోనేరు ప్రసాద్కు బెయిలు రాకుండా జైలులో ఉంచాలనే ఆయనపై 409 సెక్షన్ కింద కేసు పెట్టారు. రెండు కార్పొరేట్ సంస్థల మధ్య లావాదేవీలు జరిగినప్పుడు 409 సెక్షన్ వర్తించదు. 60 రోజుల్లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేయనందున, కోనేరుకు బెయిలు మంజూరు చేయండి'' అని జడ్జిని అభ్యర్థించారు. దీనికి సీబీఐ న్యాయవాది - 'ప్రజాధనం దుర్వినియోగమైనందునే ఆ కేసు నమోదు చేశారు. అది వ్యక్తికి వ్యతిరేకంగా నమోదు చేసినది కాదు. నేరానికి బాధ్యులైన వారందరికీ అదే వర్తిస్తుంది'' అని చెప్పారు.
గాలి జనార్దన్రెడ్డి లాయర్ కూడా 409పై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు కోర్టు తోసిపుచ్చిందని గుర్తు చేశారు. "ఈ ప్రాజెక్టులో ఎమ్మార్కు 74 శాతం, ఏపీఐఐసీకి 26 శాతం వాటా దక్కాలి. కానీ... లోపాయికారీ వ్యవహారాలవల్ల ఏపీఐఐసీ వాటా 6.5 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వానికి తెలియకుండానే ఎంజీఎఫ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ప్లాట్లు, విల్లాలు అమ్మడానికి పి.రంగారావు, భానుమతి డైరెక్టర్లుగా 'స్ల్టైలిష్ హోమ్' అనే సంస్థను సృష్టించారు. చదరపు గజం రూ.5 వేలుగా రికార్డుల్లో చూపి, రూ. 50 వేల వరకు అమ్మిసొమ్ము చేసుకున్నారు. ఇప్పటికి 38 విల్లాలు, 43 ప్లాట్ల ఓనర్లు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారు.తాము చెల్లించిన మొత్తాన్ని వెల్లడించారు. మొత్తం రూ.138 కోట్లు దుర్వినియోగం అయినట్లు తేలింది'' అని కోర్టుకు వివరించారు. విల్లాలు, ప్లాట్లు కొన్నవారు అనధికారికంగా చెల్లించిన సొమ్ములో కొంత మొత్తం కోనేరు ప్రసాద్ కుమారుడి ఖాతాలో కూడా జమ అయిందని తెలిపారు. ఇన్ని అక్రమాలు జరిగినందునే ఐపీసీ 409 సెక్షన్ ప్రయోగించాల్సి వచ్చిందన్నారు. విచారణను జడ్జి నాగమారుతీ శర్మ 12వ తేదీకి వాయిదా వేశారు.