బొత్స వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి: ఢిల్లీలో పంచాయతీ
తన వ్యూహం ద్వారా బొత్స సత్యనారాయణకు, దామోదర రాజనర్సింహకు తదితరుల దూకుడుకు కళ్లెం వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి వర్గ ప్రక్షాళనకు అనుమతి కోరేందుకు ముఖ్యమంత్రి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అపాయింట్మెంట్ కోరినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వ్యూహంలో భాగంగానే ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు మంత్రి పదవిని అడ్డుకోవడానికి కాంగ్రెసు ఎమ్మెల్సీలు అధిష్టానానికి లేఖ రాసినట్లు బొత్స వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా, తనపై కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదులు చేసే అవకాశాలున్నాయని, దాన్ని తిప్పికొట్టడానికి ఢిల్లీలో ఉండడం అవసరమని బొత్స అనుకున్నట్లు చెబుతున్నారు.
కాగా, మంత్రులు, శాసనసభ్యులు ఢిల్లీ దారి పట్టారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, టిజి వెంకటేష్, శానససభ డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి ఢిల్లీ వెళ్తున్నారు. పలువురు ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. బొత్స, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలపై అధిష్టానం వద్ద పంచాయతీ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.