ఎవరెవరికి మంత్రి పదవులు, ఎవరికి ఉద్వాసన?
తనకు అత్యంత సన్నిహితుడైన నల్లగొండ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు ఉత్తమ కుమార్ రెడ్డికి, ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి పదవులు ఖాయమని అంటున్నారు. కాంగ్రెసు నుంచి మరొకరికి అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. తెలంగాణకు చెందిన గండ్ర వెంకటరమణా రెడ్డిని గానీ, అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డిని గానీ ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో చేర్చుకుంటున్నారని చెబుతున్నారు. కాగా, వెలమ సామాజిక వర్గం నుంచి సుజయ్ కృష్ణ పేరు ముందుకు వస్తోంది. కాంగ్రెసు నుంచి మాత్రం మూడు మంత్రి పదవులు మాత్రమే ఉంటాయని అంటున్నారు.
చిరంజీవి వర్గానికి సంబంధించి ఏ విధమైన వివాదం లేదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సూచించిన సి. రామచంద్రయ్యకు, గంటా శ్రీనివాస రావులకు మాత్రమే ప్రజారాజ్యం నుంచి మంత్రి వర్గంలో అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. తనకు తలనొప్పిగా మారిన పి. శంకరరావు, కడప జిల్లాకు చెందిన అహ్మదుల్లాకు, తోట నరసింహానికి ఉద్వాసన పలకాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, డిఎల్ రవీంద్రా రెడ్డి, కె. జానా రెడ్డి శాఖలను మార్చడం ద్వారా వారి దూకుడు కళ్లెం వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.