జగన్ సాక్షి డైలీ వాణిజ్య ప్రకటనలపై సిబిఐ ఆరా

వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణలో భాగంగా సాక్షి పత్రికకు ప్రభుత్వపరంగా సమకూరిన ప్రయోజనాలను సిబిఐ పరిగణనలోకి తీసుకున్నట్లు ఓ పత్రిక రాసింది. సాక్షి దినపత్రికకు ఏ ప్రాతిపదికతో ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసింది, వాటి జారీలో ఎవరి ప్రమేయం ఏ మేరకు ఉంది, సాక్షికి కేటాయింపుల తీరెలా ఉంది, అప్పటి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులపై ఏ మేరకు ఒత్తిళ్లు పని చేశాయి, తదితర అంశాలపైనా సిబిఐ విచారణ చేపట్టినట్లు వార్తలు వచ్చాయి.
ఓ ప్రముఖ పత్రిక వార్తాకథనం ప్రకారం - సాక్షికి ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వం 2008 ఏప్రిల్ 24న ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) ధ్రువీకరణ పత్రం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 18 నెలలకు ప్రకటనలు జారీ చేయాలనే నిబంధనను పక్కన పెట్టి సాక్షికి ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వైయస్ హయాంలో పత్రికలవారీగా ఇచ్చిన ప్రకటనల వివరాలను సిబిఐ సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి సేకరించింది.












Click it and Unblock the Notifications