విస్తరణ కొలిక్కి: చిరుకు రెండు, తెలంగాణకు మూడు?
తెలంగాణకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు రాజీనామాలు చేయడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఈ స్థితిలో ఖాళీల్లో తెలంగాణ మంత్రులను తీసుకోకుండా చిరంజీవి వర్గానికి మాత్రమే మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కిరణ్ కుమార్ రెడ్డి వాదిస్తూ వస్తున్నారు. అలాగే, వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామా వల్ల వ్యవసాయ శాఖకు మంత్రి లేకుండా పోయారు. కొంత మంది మంత్రులకు ఉద్వాసన పలికి, కొత్తవారిని తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకుండా చిరంజీవి వర్గానికి మంత్రి పదవులు ఇవ్వడం సరి కాదని అంటున్నారు. ముఖ్యమంత్రి అభిప్రాయంతో అధిష్టానం ఏకీభవించినట్లు చెబుతున్నారు.
సోనియాతో సమావేశం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గానీ, ఆజాద్ గానీ మీడియాతో మాట్లాడలేదు. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కన్నా ముందే మంగళవారం సాయంత్రం ఆజాద్ను కలిశారు. ఆజాద్తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీన్ని బట్టి అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.