డీజే సౌండ్ దెబ్బకు చిట్లిన మెదడు రక్తనాళాలు.. ఒక్క రూపాయైనా సాయం చేయండి!
పెళ్లి ఇంట ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన వేడుక.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. స్నేహితులతో కలిసి సరదాగా స్టెప్పులేసిన ఆ 18 ఏళ్ల యువకుడి జీవితం ఇప్పుడు ఆసుపత్రి బెడ్పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. డీజే (DJ) డ్రమ్స్ ఇచ్చే రాక్షస శబ్దాల తీవ్రతకు ఒక నిరుపేద కూలీ కొడుకు మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి, మృత్యువుతో పోరాడుతున్న ఘోర ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో, చేతిలో చిల్లిగవ్వ లేక ఆ నిరుపేద తండ్రి తన కొడుకును బతికించుకోవడానికి దాతల కోసం కన్నీరుమున్నీరుగా ఎదురుచూస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం ఎస్సీ కాలనీకి చెందిన సంగసాని పార్థు (18) ఒక సమీప బంధువు ఇంటి పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. అక్కడ ఏర్పాటు చేసిన డీజే పాటల హోరుకు మిగతా యువకులతో కలిసి పార్థు కూడా ఎంతో ఉత్సాహంగా నృత్యం చేయడం ప్రారంభించాడు. అయితే, డీజే స్పీకర్ల నుండి వచ్చిన విపరీతమైన శబ్ద తరంగాల తీవ్రతను ఆ యువకుడి శరీరం తట్టుకోలేకపోయింది. డ్యాన్స్ చేస్తూనే పార్థు ఒక్కసారిగా తల పట్టుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

మెదడులో చిట్లిన రక్తనాళం: హైదరాబాద్కు తరలింపు
తీవ్ర అస్వస్థతకు గురైన పార్థును కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, గుండె నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం తీవ్రంగా దెబ్బతిని (డ్యామేజ్ అయి), లోపల బ్లీడింగ్ అవుతున్నట్లు, రక్తం గడ్డకట్టిందని నిర్ధారించారు. డీజే శబ్దాల తీవ్రతే ఇందుకు ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పార్థును తక్షణమే హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు.
దాతల కోసం ఎదురుచూపు!
బాధిత యువకుడి తండ్రి సంఘసాని నరసింహారావు రోజువారీ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తేనే గానీ ఇల్లు గడవని పరిస్థితి. ఇప్పటికే ఖమ్మంలో ప్రాథమిక చికిత్స కోసం రూ. 50 వేల వరకు అప్పులు చేసి ఖర్చు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో అత్యవసర ఆపరేషన్, తదుపరి చికిత్సల కోసం మరో రూ. 6 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు. అంత పెద్ద మొత్తం ఈ పేద కుటుంబానికి ఆకాశమంత భారంగా మారింది. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోతుంటే.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ తండ్రి దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.
సహాయం చేయాలనుకునే దాతల కోసం..
రూ. 6 లక్షలు ఉంటేనే తన కొడుకు ప్రాణాలు దక్కుతాయని వైద్యులు చెప్పడంతో, దయ హృదయం గల దాతలు ఎవరైనా తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి తన బిడ్డను కాపాడాలని తండ్రి నరసింహారావు చేతులు జోడించి వేడుకుంటున్నారు. సహాయం చేయదలచిన వారు 8309515263 మొబైల్ నెంబర్ ద్వారా నేరుగా సంప్రదించి లేదా గూగుల్ పే/ఫోన్ పే ద్వారా సహాయాన్ని అందించి ఆ యువకుడికి పునర్జన్మ ప్రసాదించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు.














Click it and Unblock the Notifications