ఏలూరు రైల్వేస్టేషన్కు మహర్దశ.. ఆలయ గోపురం తరహా ఎంట్రన్స్ తో విశేషాలివే
అమృత్ భారత్ స్టేషన్ల పథకం ఏపీ రైల్వే రూపు రేఖలను మార్చేస్తోంది. రైల్వే స్టేషన్ ల అభివృద్ధికి ప్రారంభించిన ఈ పథకం దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ లను అత్యద్భుతంగా తీర్చి దిద్దుతోంది. ఈ క్రమంలో ఏపీలోని ఏలూరు రైల్వే స్టేషన్ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏలూరు రైల్వే స్టేషన్ ఇప్పుడు కేవలం రైలు ప్రయాణికుల కేంద్రం కాకుండా, ఆధ్యాత్మిక ప్రదేశం లాంటి అందమైన రూపును సంతరించుకుంది.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏలూరు స్టేషన్ అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏలూరు స్టేషన్ను అభివృద్ధి చేసిన విధానం ప్రజలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా స్టేషన్ ప్రవేశ ద్వారంను ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన ద్వారక తిరుమల గాలి గోపురం శైలిలో తీర్చిదిద్దడం విశేషం. స్టేషన్కు వచ్చే ప్రయాణికులు ఆలయానికి వెళ్తున్నట్లు భావించేలా ఆర్చ్ నిర్మాణం చేశారు.

స్థానిక సంస్కృతి, కళారూపాలను ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ
గోపురం డిజైన్, సాంప్రదాయిక మూలకాలు, ఆధునిక లైటింగ్ వ్యవస్థలు కలిపి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించాయి. ఇంటీరియర్ డిజైన్లో కూడా స్థానిక సంస్కృతి, కళారూపాలను ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ వహించారు. వెయిటింగ్ హాళ్లు, ప్లాట్ఫామ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి సౌకర్యాలను ఎయిర్పోర్టు స్థాయిలో అందించడంతో పాటు, స్థానిక సంప్రదాయాలను కలగలిపి ఏలూరు స్టేషన్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఆలయ శైలిలో అభివృద్ధి
ఏలూరు జిల్లా ప్రజలు ద్వారక తిరుమలను చిన్న తిరుపతిగా భావిస్తారు. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు ఎక్కువగా ఏలూరు రైల్వే స్టేషన్లో దిగి ఆలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఎంట్రన్స్ను ఆలయ శైలిలో అభివృద్ధి చేయడం భక్తులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ రైల్వే స్టేషన్ కు సంబంధించి రైల్వే శాఖ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రయాణికులు ఈ కొత్త అభివృద్ధిని హర్షిస్తూ, రైల్వే శాఖకు అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లో 70కి పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో 70కి పైగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు అందించడంతో పాటు, ప్రాంతీయ సంస్కృతి, కళ, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏలూరు స్టేషన్ ఈ పథకంలో ఉత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ అభివృద్ధి వల్ల ఏలూరు మరింతగా పర్యాటక రంగంలో ముందుకు సాగుతుంది.
ఏలూరు స్టేషన్ను చూసి ఆనందించే అవకాశం
ఆలయ భక్తులు, సాధారణ ప్రయాణికులు ఇకపై ఏలూరు స్టేషన్ను చూసి ఆనందించే అవకాశం ఏర్పడింది. రైల్వే అధికారులు పనులను త్వరగా పూర్తి చేసి, స్టేషన్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త రూపం ఏలూరు నగర గౌరవాన్ని మరింత పెంచుతుందని స్థానికులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications