కాంగ్రెసు రాజకీయాలను చిరంజీవి చదివేశారా?
కాంగ్రెసు అధిష్టానానికి విధేయుడిగా కనిపిస్తూనే తన కోరికలను నెరవేర్చుకునేందుకు ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి తాను మాత్రమే దిక్కు అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెసు పార్టీని కాపాడేందుకు తాను తప్ప మరొకరు పనికి రాబోరని, అందువల్ల తన ప్రాబల్యం కొనసాగాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న ఉప ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి కోరికలను తీర్చడానికి అధిష్టానం ముందుకు వస్తోంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి, ఆయన వర్గం వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ నాయకుడిగా కాకుండా భాగస్వామ్య పక్షం నాయకుడిగా, అంటే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగానే చిరంజీవి వ్యవహరిస్తున్నారని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి కాంగ్రెసు రాజకీయాలను క్షుణ్నంగా అధ్యయనం చేయడం వల్లనే తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది.